నేటి నుండి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం
రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 03: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నేటి నుండి ఈ నెల 8 వరకు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఓటింగ్ కు ముందే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. 85 సంవత్సరాల వయస్సు పైబడి వారు, దివ్యాoగులు ఎవరైతే పోలింగ్ కేంద్రానికి రాలేక పోతున్నారో అట్టి వారి దగ్గరకు మనమే వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. హోం ఓటింగ్ విషయమై సంబంధిత ఓటరు కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన సమయానికి ఓటరు అందుబాటులో లేకుంటే, రెండోసారి ముందస్తుగా సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. హోమ్ ఓటర్ల జాబితా పోటీచేయు అభ్యర్థులకు ముందస్తుగా షెడ్యూల్ తో పాటు ఇవ్వాలన్నారు. ఎస్సెన్షియల్ సర్వీసెస్ ఎఫ్సిఐ, ఇండియన్ రైల్వే, ఫైర్, విద్యుత్, వైద్య ఆరోగ్య, టీఎస్ ఆర్టీసీ, పౌరసరఫరాలు, బిఎస్ఎన్ఎల్, గుర్తింపు పొందిన మీడియా వారికి పోస్టల్ బ్యాలెట్ కల్పించినట్లు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు వున్న ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ జారిచేసి, వారు విధులు నిర్వర్తించే చోట ఓటుహక్కు వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పత్రాల పూరింపు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టే జాగ్రత్తలన్నీ చేపట్టాలన్నారు. ఏ రోజు కారోజు పోలైన పోస్టల్ బ్యాలెట్లు, పోల్ కాని పోస్టల్ బ్యాలెట్లు సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి అప్పగించాలన్నారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల,జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులు కె. శ్రీరామ్, మదన్ గోపాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List