ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి పూచీ నాది: బీజేపీ అభ్యర్థి వినోద్ రావు
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 16: గత పాలకులు అభివృద్ధిని విస్మరించి వెనుకబాటుకు కారణమయ్యారని, తనకు ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి పూచీ తనదని ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లాడ మండలం, బాలపేట్, అన్నారుగూడెం, బిల్లుపాడు గ్రామాలలో అయన మంగళవారం పర్యటించి ప్రసంగించారు. బాలపేట్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అన్నారుగూడెం చేరుకున్నప్పుడు ప్రజలు డప్పుచప్పుళ్లతో, కళాకారుల కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ- గత ఎన్నికల్లో అన్ని పార్టీలకూ అవకాశం ఇచ్చిన ఓటర్లు మోసపోయారని, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి తనకు అవకాశం కల్పిస్తే జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం బిల్లుపాడు గ్రామస్థులతో మాట్లాడుతూ- అయిదు వందల సంవత్సరాల అయోధ్య రామ మందిర కలను సాకారం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ ని, మరో సారి బీజేపీకి అవకాశం ఇస్తే వచ్చే అయిదు సంవత్సరాలలో చేసే గణనీయమైన అభివృద్ధి సాధించి భారత్ ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతారని అన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ గుమ్మం తల్లాడలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పర్యవేక్షణలో మండల అధ్యక్షులు ఆపద రామారావు నాయకత్వంలో పర్యటన మొదలయ్యింది. వీరితో పాటు పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ వీరంరాజ్లతో కలిసి మల్లారం గ్రామంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు, గ్రామంలో జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, జిల్లా అధికార ప్రతినిధి పగిడాల మధు, చావా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List