అధికారిక బంగ్లా మారవద్దంటూ సూచన... తిరస్కరించిన కేజ్రీవాల్
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 18: ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక బంగ్లాను మరో వారం రోజుల్లో ఆయన ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఉన్న అధికార బంగ్లాను ఆయన ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. ఆ నివాసాన్ని ఖాళీ చేయవద్దని అరవింద్ కేజ్రీవాల్కు పార్టీలోని పలువురు అగ్రనేతలు సూచించారని తెలిపింది. ఈ సూచనను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తొసిపుచ్చారని పేర్కొంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై వివిధ సందర్భాల్లో దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భద్రతపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ను ఆ దేవుడే కాపాడతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది మార్చి 21న మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల ఈ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.అనంతరం పార్టీ శాసనసభ పక్షం సమావేశంలో ముఖ్యమంత్రిగా అతిషిని ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సెనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖ అందజేశారు. అలాగే అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో అతిషి.. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు పట్టం కడితేనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comment List