వైసీపీకి బిగ్ షాక్- మరో సీనియర్ గుడ్బై
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 18:అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి. ఈ ఓటమి.. ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు.కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు.ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా ఇటీవలే పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే.ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.ఆమెతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు గంటా ప్రసాదరావు టీడీపీ కండువా కప్పుకొన్నారు. కొద్దిసేపటి కిందటే వాళ్లంతా ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వాళ్లందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కండువా కప్పి స్వాగతించారు.ఇదివరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు అదే బాటలో అదే ఉమ్మడి జిల్లాకు చెందిన గంటా పద్మశ్రీ కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్బై చెప్పడం, ఆ వెంటనే టీడపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీకి స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ఉన్న ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గినట్టయింది.
Comment List