నామినేటెడ్ పోస్టులు ఖరారు - వీరికి కీలక పదవులు..!
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 15:ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్దమైంది. తుది కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా....మరో సారి వడపోత కోసం వాయిదా వేసారు. దసరాకు ముందే పదవులను ప్రకటించే లా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్దమవుతోంది. కూటమి శ్రేణులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, మిగిలిన పది శాతం పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేశారు.కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్గా తీసుకున్నారు. మూడు పార్టీలకు పదవుల పంపకాల పైన ఒక ఫార్ములాను ఆమోదించారు. టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం. దేవినేని ఉమకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిలారి శ్రవణ్ కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి ఛైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా.. విడతల వారిగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 30శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది.
Comment List