యోగా మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ ప్రతినిధి భీమిలి సెప్టెంబర్ 11:యోగ సకలజనుల సమ్మేళనమని, మనిషి సంపూర్ణ ఆరోగ్య వికాసానికి నాంది పలుకుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 49వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్ -2024 పోటీలకు సంబందించిన పోస్టర్ను విశాఖలో ఉన్న గంటా శ్రీనివాసరావు నివాసంలో విడుదల చేసారు. ఈనెల 14,15 తేదీలలో రెండురోజుల పాటు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనికి సంబందించిన కార్యనిర్వాహక టీమ్ సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం గంటా మాట్లాడుతూ మనిషి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలని అన్నారు. పిల్లలకు చిన్న వయసు నుండే యోగాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని గంటా అన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు పోటీలకు సంబంధించిన వివరాలు తెలియజేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల నుండి సుమారుగా 500 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని అన్నారు. వీరితో కోచ్ లు, రిఫరీలు కూడా పాల్గొంటారని అన్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలకు భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆతిద్యం ఇస్తుందని తెలిపారు. వయస్సుల వారీగా మొత్తం 11 బ్యాచ్ లు ఉంటాయని, సబ్ జూనియర్స్, జూనియర్స్, వెటరన్ వారీగా పురుషులు, స్త్రీలను వేర్వేరు టీమ్ లుగా ఎంపిక జరుగుతుందని అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందని, అడిగిన వెంటనే కాదనక తప్పకుండా వస్తామని చెప్పారని సార్ కి ధన్యవాదములు అని తెలియజేసారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, డా. యు. రామరావు, ఎన్. శ్రీనివాసరావు, జె.డి.చక్రవర్తి, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List