బెజవాడలో మళ్లీ టెన్షన్ ! ఉదయం నుంచీ పెరుగుతున్న బుడమేరు వరద.. !
ఐ ఎన్ బి టైమ్స్ సెప్టెంబర్ 06:విజయవాడను బుడమేర వరద టెన్షన్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. వారం రోజులుగా బుడమేరు వరద బారిన పడి జనం ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. తాజాగా మరోసారి ప్రవాహం పెరుగుతోంది. ఓవైపు బుడమేరకు పడిన మూడు గండ్లను పూడ్చేందదుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు నగరంలో బుడమేరు ప్రవాహం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జనంలో ఆందోళన కూడా పెరుగుతోంది.గతవారం గంటల వ్యవధిలో సింగ్ నగర్, కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా పలు ప్రాంతాల్ని ముంచెత్తిన బుడమేరు వరద పేరు వింటేనే స్ధానికులు బెంబెలెత్తుతున్నారు. అప్పటి వరద నీరు ఇంకా తమ ఇళ్లను వీడకపోవడంతో అలాగే మగ్గిపోతున్న బాధితులు ఇవాళ ఉదయం నుంచీ మళ్లీ వరద పెరగడంతో ఆందోళనలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు అందక ఇబ్బందులు పడుతున్న జనానికి ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.నగరంలో ఉదయం నుంచీ బుడమేరు వరద ప్రవాహం పెరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బుడమేరు వరదకు తీవ్రంగా దెబ్బతిన్న సింగ్ నగర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 5 అడుగుల మేర నీరు పెరిగిందని చెప్తున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభమైంది. నగరంలోని సిద్ధార్ద్ కాలేజ్, అమ్మ కల్యాణ మండపంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నిత్యావసర సరుకుల ప్యాక్ లు వరద ప్రాంతాలకు పంపుతున్నారు.
Comment List