పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ -- వ్యాధినిరోధక టీకాలు ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలి : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, తల్లాడ మార్చి 27: పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. షుగర్, బి పి. వ్యాధిగ్రస్థులకు ప్రతి నెలా మందులు ఇవ్వాలన్నారు. వ్యాధినిరోధక టీకాలు ఎంతమంది పిల్లలకు ఇచ్చినది, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సింది అడిగి తెలుసుకున్నారు. వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క పిల్లవాడికి అందించాలన్నారు. పాము, కుక్క కాట్లకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇడిడి చార్ట్ ప్రదర్శించాలన్నారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు సమయానుసారం చేయించాలని ఆయన తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా తల్లాడ మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comment List