సార్వత్రిక ఎన్నికలవేళ కేరళ సీఎంకు షాక్: కుమార్తె వీణా విజయన్ పై ఈడీ కేసు!!
సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక మనీ లాండరింగ్ కేసులలో ఈడి అధికారుల దూకుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించిన ఈడి అధికారులు, ఇక తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు మొదలు పెట్టింది. వీణా విజయన్ కు సంబంధించిన ఐటీ సంస్థతోపాటు, కొచ్చిన్ లోని గనుల సంస్థ సీఎంఆర్ ఎల్ పై కూడా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ ను దాఖలు చేసింది. కేరళ సీఎం వినయ్ విజయన్ కుమార్తెపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి పి ఎమ్ ఎల్ ఏ చట్టం కింద నమోదు చేసిన ఈ డి త్వరలో సమన్లు జారీ చేయనుంది. వీణ విజయన్ కు సంబంధించిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందని ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు ఈడి అధికారులు తెలిపారు. ఇక ఈ కేసు విచారణకు సంబంధించి వీణతో పాటు మరికొందరికి సమన్లు జారీ చేయనున్నారు. కొచ్చిన్ కు చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే సంస్థ వీణ విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి 2018 - 2019 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. అయితే కొచ్చిన్ మినరల్స్ ఎటువంటి సర్వీస్ ను పొందకుండానే ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కు చెల్లింపులు చేసినట్టు ఐటీ శాఖ పేర్కొంది, దీనిపైన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఈ సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని వీణా విజయన్ తో పాటు మరికొందరిపైన ఈడి అధికారులు విచారణ జరపనున్నారు. ఎన్నికల సమయంలో కేరళ సీఎం కుమార్తెపై ఈడీ విచారణ సీఎం కు షాక్ అనే చెప్పాలి.
Comment List