5 చాపకూడుతో కుల రహిత పాలనకు నాంది పలికిన గడ్డ పల్నాడు..!
పల్నాడు పౌరుషాలకే కాదు,సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు.
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మార్చి 16 :13వ శతాబ్దంలో చాపకూడు సిద్ధాంతంతో కుల రహిత పాలనకు ఆనాడే మంత్రి బ్రహ్మనాయుడు శ్రీకారం చుట్టారని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం గురజాల నియోజకవర్గంలోని గామలపాడు గ్రామంలో కొలువుదీరిన గురజాల రాజ్యం శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ చెన్న మల్లిఖార్జున స్వామి వారి పురాతన ఆలయం పునఃప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గర్భాలయంలో కొలువుదిరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పండితులచే ఆశీర్వాచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. పల్నాడు అంటే పౌరుషలకే కాదు, సాంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు అని గుర్తు చేశారు. అటువంటి సంస్కృతిని కాపాడేందుకు,పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పూనుకోవడం హర్షనీయమన్నారు. గురజాల రాజ్యం మంత్రి నాయకురాలు నాగమ్మచే నిర్మించి, పూజలు అందుకున్న ఆ పరమేశ్వరుని దర్శించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పల్నాడు వారసత్వ సంపదను కాపాడుకోవడానికి పెద్దలు సూచించిన ప్రతిపాదనలను నెరవేర్చడానికి తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. అలానే పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నిరంతర కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.శతాబ్దాల చరిత్ర ఉన్న పల్నాడును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉందని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. ఆలయ ప్రవేశం అన్ని కులాలకు కల్పించిన, సమానత్వపు చరిత్ర కూడా పల్నాడుదేనని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఘనమైన చరిత్రను పునర్నిర్మించేందుకు ప్రతి ఒక్కరు ఇటుక ఇటుక పేర్చి భావి తరాలకు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, నన్నూరు నర్సిరెడ్డి, తాళ్లాయపాలెం శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పీఠాధిపతులు, పలువురు స్వామీజీలు పాల్గొన్నారు.
Comment List